హైదరాబాద్ శివార్లలో ట్రాక్టర్ ను ఢీకొన్న కారు... ఇద్దరు కానిస్టేబుళ్లు సహా నలుగురు దుర్మరణం!

  • దెబ్బడగూడలో తెల్లవారుజామున ఘటన
  • అతివేగమే ప్రమాదానికి కారణమన్న పోలీసులు
  • కన్నీరుమున్నీరవుతున్న మృతుల బంధువులు
హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా దెబ్బడగూడలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురిని బలిగొంది. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, మైసిగండి దేవాలయానికి నలుగురు యువకులు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారు వేగంగా వస్తూ, ముందు నెమ్మదిగా వెళుతున్న ట్రాక్టర్ ను బలంగా ఢీకొట్టింది.

 ఈ ప్రమాదంలో  కారు నడుపుతున్న మలక్‌ పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ వినోద్‌, నారాయణగూడ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ శివకుమార్‌ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా, వారు చికిత్స పొందుతూ మృతిచెందారు. ఉత్సాహంగా ఆలయానికి వెళ్లిన తమ బిడ్డలను ఇలా చూడలేకున్నామని మృతుల బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. యాక్సిడెంట్ పై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Road Accident
Speed
Tractor
Car
Hyderabad

More Telugu News